తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు అరెస్టు అయ్యారు. మంగళవారం ఉదయం బంజారాహిల్స్లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మురళీధర్రావుకు సంబంధించి బంధువులతోపాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్గా పని చేశారు మురళీధర్రావు. ఆయన అరెస్టుతో కొందరి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ వర్గాల సమాచారం మేరకు నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీరింగ్ ఉన్న సమయంలో మురళీధర్రావు ఎక్కువగా ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు. ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు దగ్గర పెట్టి విచారణ చేస్తున్నారు. కుటుంబసభ్యులతోపాటు బినామీ పేర్లు మీద ఆయన భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. బ్యాంకు లాకర్లను గుర్తించే అవకాశముంది. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారుల అంచనా ప్రకారం దాదాపు 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత ఏసీబీ కోర్టులో ఆయన్ని అధికారులు హాజరుపర్చనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంటే 2013లో పదవీ విరమణ పొందారు మురళీధర్రావు. దాదాపు 11 ఏళ్లపాటు ఆయన ఈఎన్సీగా కొనసాగారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు మురళీధర్రావు పని చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఆయన పదవీ కాలాన్ని పలు దఫాలుగా పొడిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిరోజులు ఆ పదవిలో కొనసాగారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును తొలగించింది రేవంత్ సర్కార్.