25 వేలు దాటిన యాక్టివ్ కేసులు!
భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో ఐదు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Minister) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,335 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. నిన్న ఒక్కరోజే 4,435 కేసులు నమోదయ్యాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ 23 తర్వాత రోజూవారీ కొవిడ్ కేసులు 5,000 వేల మార్క్ను దాటడం ఇదే తొలిసారి.
తాజా కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల (Positive Cases) సంఖ్య 4,47,33,719కి చేరింది. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య ఏకంగా 25వేల మార్క్ను దాటేసింది. ప్రస్తుతం 25,587 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే మహమ్మారి నుంచి 2,826 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,41,82,538కి చేరింది. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళలో ఎనిమిది మంది, కర్ణాటక, మహారాష్ట్రలో ఇద్దరు చొప్పున, పంజాబ్లో ఒక్కరు చొప్పున మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 5,30,929కి చేరింది.