బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ (BRS MLA Redua Naik) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. కురవి మండలం, అయ్యగారిపళ్లి గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో ఇంటి దొంగలు ఉన్నారని.. వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేనెప్పుడు చస్తానా అని.. కొందరు నా చావు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వాళ్లు తన ఓటమి కోసం గతంలో పనిచేశారని.. భవిషత్తులోనూ పనిచేస్తారని అన్నారు.
కొందరు వ్యక్తులు పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తున్నారని, అలాంటి వారిని గుర్తు పెట్టుకోవాలని రెడ్యానాయక్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాటానికి ప్రయత్నాలు చేస్తారని.. పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod)ను ఉద్దేశించే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పోరాటమే చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతోనే గెలుస్తున్నానన్నారు. తన పనితనానికి నియోజకవర్గ అభివృద్ధే నిదర్శనమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరించాలని రెడ్యానాయక్ పిలుపిచ్చారు.