తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమేనని, ఆ సమాచారాన్ని కేసీఆర్, జగన్ పంచుకున్నారని షర్మిల ఆరోపించారు. తన ఫోన్తో పాటు, తన భర్త ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆరోపణలపై జగన్ తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో తొలిసారిగా స్పందించారు. షర్మిల ఫోన్ ను ట్యాపింగ్ చేశారో లేదో తనకు తెలియదని ఆయన అన్నారు. గతంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పారు. తనకు తెలంగాణ వ్యవహారాలతో సంబంధం లేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని చెప్పారు.