ఓటర్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం 15 రోజుల్లోనే ఓటర్ ఐడీ కార్డులను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొత్త కార్డు లేదా మార్పులు చేర్పులు చేసిన కార్డు పొందడానికి నెల రోజులకు పైగా సమయం పడుతుండగా, ఈ నూతన విధానంతో ఆ జాప్యం తగ్గనుంది.
ఈ కొత్త విధానం ప్రకారం, కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారికి, అలాగే తమ ఓటర్ కార్డులోని వివరాలలో మార్పులు కోరిన వారికి ఇది వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్డు తయారీ నుంచి ఓటరు చేతికి అందే వరకు ప్రతి దశను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) స్థాయి నుంచి పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేసేంత వరకు రియల్-టైమ్ ట్రాకింగ్ చేయనున్నట్లు పోల్ అథారిటీ తెలిపింది. అంతేకాకుండా, కార్డు ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లకు తెలియజేయనున్నారు.
త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, వచ్చే ఏడాది తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు సత్వర సేవలు అందించేందుకు ఎన్నికల సంఘం ఈ దిశగా కసరత్తు చేపట్టింది.