AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎయిర్ ఇండియా మరో కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియా తమ అంతర్జాతీయ వైడ్‌బాడీ విమాన సర్వీసులను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం మేర ఈ సర్వీసులను తగ్గించనున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వైడ్‌బాడీ బోయింగ్ 777 విమానాలకు మరింత విస్తృతంగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా స్పష్టం చేసింది.

 

గత కొంతకాలంగా నిర్వహణాపరమైన సమస్యలు కూడా ఎయిరిండియాను ఇబ్బంది పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే గడిచిన ఆరు రోజుల్లో సంస్థకు చెందిన 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ప్రస్తుత సర్వీసుల తగ్గింపునకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

 

బోయింగ్ 777 విమానాల్లో చేపట్టే ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా ప్రయాణ భద్రతను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని సూచించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10