ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్ కు తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తల్లికి వందనం’ పథకానికి సంబంధించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
“జగన్… నా నుంచి నీకు మరో సవాల్. తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు లోకేశ్ అకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు… ఈ ఆరోపణలను నిరూపించడానికి 24 గంటల సమయం ఇస్తున్నాను… దమ్ముంటే నిరూపించాలి” అని లోకేశ్ సవాల్ చేశారు.
ఒకవేళ ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే, చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకుని, జరిగిన తప్పును అంగకరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో, చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ రకమైన అసత్య ప్రచారాలను ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి తల్లుల ఖాఆలో నగదు జమ అవుతోంది. తల్లికి వందనం పథకంలో అందించే నగదు రూ.15 వేలు కాగా, ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన 2 వేలు పాఠశాల/కాలేజీ విద్యాభివృద్ధి నిధి నిమితం ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ అవుతాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.