మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని, నిరాధారమైనవని పేర్కొంటూ గట్టిగా బదులిచ్చింది. ఈ మేరకు గత ఏప్రిల్లో ఇచ్చిన వివరణాత్మక పత్రాన్ని మరోసారి విడుదల చేసింది.
ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో రాహుల్ గాంధీ, 2024 నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నియామక ప్యానెల్ను తారుమారు చేయడం, ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచి చూపడం, లక్షిత దొంగ ఓటింగ్ వంటి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం సంతకం లేని, దాటవేసే ధోరణిలో నోట్స్ విడుదల చేసిందని, తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, బూత్ల సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, ఎన్నికల సంఘం రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది. పోలింగ్ సమయంలో గానీ, ఆ తర్వాత జరిగిన పరిశీలనలో గానీ కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ ఏజెంట్ల నుంచి కూడా తీవ్రమైన ఫిర్యాదులు రాలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణలపైనా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, 9.77 కోట్ల ఓటర్లకు గాను కేవలం నామమాత్రపు అప్పీళ్లే దాఖలయ్యాయని గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రవ్యాప్తంగా 27,000 మందికి పైగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించిందని, వారెవరూ ఈ తరహా ఫిర్యాదులు చేయలేదని పేర్కొంది.
ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీకి గతేడాది డిసెంబర్ 24న సమగ్ర సమాధానం ఇచ్చామని, ఆ వివరాలు ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వాస్తవాలను విస్మరించి, పదేపదే నిరాధార ఆరోపణలు చేయడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని ఈసీ వ్యాఖ్యానించింది. భారత ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో జరుగుతుందని, ఓటర్ల తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఎన్నికల సంఘాన్ని నిందించడం తగదని హితవు పలికింది.