కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన అభయహస్తం మేనిఫెస్టో ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. పార్టీని వీడి వెళ్ళిన పది మంది శాసనసభ్యులకు కర్రు కాల్చి వాత పెట్టాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
గద్వాల నియోజకవర్గానికి చెందిన కొందరు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు నేడు హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానం “నిందలు, దండాలు, చందాలు” అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతోందని ఆయన అన్నారు.
రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ నెలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని, బూత్ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, భవిష్యత్తులో బీఆర్ఎస్కు ప్రజల మద్దతు లభిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరును ఆయన తప్పుబట్టారు.