క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. పలుమార్లు విచారణకు పిలిచినా హాజరుకాని ఆయన, రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో చివరకు బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్లో నిన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్ట్పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అరెస్ట్లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరుగుబాటు ఉంటుంది అని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాకాణి అరెస్ట్పై జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.