విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసు నమోదైంది. నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సదరు యువతి నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఆమెకు పాజిటివ్గా తేలింది. ఈ ఫలితాన్ని మరింత ధ్రువీకరించుకోవడం కోసం, నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అక్కడి పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్గానే నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ధ్రువీకరించారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం సాయంత్రం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలు ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజలలకు ఆరోగ్య శాఖ సూచన
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య, ఆరోగ్య శాఖ కోరింది.
* జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఇంట్లోనే వేరుగా (ఐసోలేషన్లో) ఉండాలి.
* వైద్యుల సలహాలు, సూచనలను అనుసరించి మాత్రమే మందులు వాడాలి.
* ప్రయాణాలు చేసేటప్పుడు, జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
* కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఏవైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
* తరచూ సబ్బుతో లేదా శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలి.