AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం నోటీసులు.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీశ్ సమావేశం..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ భేటీ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో, ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు జూన్ 5న విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు, గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన హరీశ్ రావు, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు కూడా కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో కమిషన్ స్పష్టం చేసింది.

 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగాయి. ఆ ప్రభుత్వంలో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రాజెక్టు రూపకల్పన, నిధుల కేటాయింపు, నిర్మాణ పనుల పర్యవేక్షణ వంటి అంశాల్లో వీరి పాత్ర కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కమిషన్ నోటీసులు జారీ చేసి, వారి నుంచి వివరణ తీసుకోనుంది.

 

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలోనూ నాణ్యతా లోపాలున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో 2024 మార్చిలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ కమిషన్ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, డిజైన్, నాణ్యత నియంత్రణ, చెల్లింపులు, అకౌంట్స్ వంటి అంశాలపై దృష్టి సారించింది. నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు సహా పలువురిని ఇదివరకే విచారించి, వారి నుంచి వివరాలు సేకరించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10