AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్యాస్ రాయితీ ఇక ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి: మంత్రి నాదెండ్ల మనోహర్..

రాష్ట్రంలో ‘దీపం-2’ పథకం కింద మూడో విడతలో గ్యాస్ సిలిండర్ రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగానే జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం నాడు సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన సచివాలయం నాలుగో బ్లాక్‌లోని ప్రచార విభాగంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “దీపం-2 పథకం మూడో దశ అమలులో భాగంగా, లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకోకముందే వారి ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా లబ్ధిదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

పథకం అమలు తీరును వివరిస్తూ, “దీపం-2 పథకం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 99,700 మంది ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ప్రస్తుతం అమలవుతున్న రెండో విడతలో భాగంగా, ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుక్ చేసుకోవడం జరిగింది” అని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10