కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నుంచి తనకు అందబోతున్న నోటీసుల అంశంపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తాను నోటీసులకు భయపడబోనని, కేసీఆర్ హయాంలో జరిగిన విషయాలను అవసరమైతే వెల్లడిస్తానని ఆయన హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ఈటల పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనతో పాటు మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, వారికి అప్పటి పరిస్థితులు తెలియవా అని ఈటల ప్రశ్నించారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణారావే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్తో విభేదించడానికి అందరూ జంకుతున్న రోజుల్లోనే తాను ఆరు నెలల పాటు ఎలా పోరాటం చేశానో తెలంగాణ సమాజం మొత్తం చూసిందని, కాబట్టి ఇలాంటి నోటీసులకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
తనకు ఇంకా కమిషన్ నుంచి అధికారికంగా ఎలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ వస్తే పార్టీ అనుమతి తీసుకుని తప్పకుండా స్పందిస్తానని ఈటల తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్లో చేరినవారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన ఒక మంత్రివర్గ ఉపసంఘంలో తాను, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి సభ్యులుగా ఉన్నామని, ఆ కమిటీ కొనసాగుతుండగానే తెరవెనుక ఏం జరిగిందో త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజినీర్లే, ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టామని చెబుతున్నప్పుడు, ఇక మంత్రుల నిర్ణయాలపై ఏం విచారణ చేస్తారని ఈటల నిలదీశారు. తనకు నోటీసులు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభాసుపాలవుతారని ఆయన వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్ గడువును పదేపదే ఎందుకు పొడిగిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కమిషన్ను నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారా, లేక రాజకీయ బ్లాక్మెయిల్ కోసం వాడుకుంటున్నారా అని ఆయన ప్రశ్నిం
చారు.