తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ధరా ఘాతంతో ఇబ్బంది పడుతున్న మందుబాబులు, తాజాగా మరో మారు లిక్కర్ ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వడదెబ్బ కొట్టినట్టు షాక్ లో ఉన్నారు. ఇటీవల బీర్ల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది.
మద్యం ధరల పెంపు సర్క్యులర్
మార్కెట్ ధరల ఆధారంగా కొత్త రేట్లు అమలులోకి రానున్నాయని తెలుస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచుతున్నట్టు ఇప్పటికే మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ అధికారులు సర్క్యులర్లు పంపినట్లు సమాచారం. ఆ సర్కులర్ ప్రకారం లిక్కర్ ధరలను పెంచి విక్రయించవలసి ఉంటుంది. ఈ మేరకు లిక్కర్ షాపులు సిద్ధం అవుతున్నాయి.
దీని ప్రకారం 180 మిల్లీ లీటర్లకు క్వార్టర్ బాటిల్ పైన పది రూపాయలు, హాఫ్ బాటిల్ పైన 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు లిక్కర్ ధరలు పెంచుతున్నట్టు సమాచారం. అయితే మద్యం దుకాణాలకు జారీ చేసిన సర్కులర్ లో ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో బీరు ధరలను 15 శాతం పెంచింది ప్రభుత్వం.
లిక్కర్ ధరలను కూడా పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 10 నుంచి 15 శాతం వరకు లిక్కర్ ధరలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇక ఫైనల్ గా త్వరలోనే మద్యం ధరల షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది .అయితే ఇప్పటివరకు లిక్కర్ ధరలను పెంపు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు.