గత నెల 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అమాయకులైన 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ పాశవిక దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పీఓకేతో పాటు పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది.
భారత బలగాలు జరిపిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. దీంతో రగిలిపోయిన పాక్… వెంటనే భారత ఆర్మీ సదుపాయాలు, జనవాసాలే టార్గెట్గా దాడులు చేసింది. వందలాదిగా డ్రోన్స్, క్షిపణులను భారత్పై ప్రయోగించింది.
దీంతో ఆకాశ్, ఎస్ 400 వంటి మన గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాయి. వాటిని ఎక్కడికక్కడ నేలమట్టం చేశాయి. ఈ క్రమంలో పాక్ మిస్సైల్స్, డ్రోన్లకు సంబంధించిన శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు భారీ ఎత్తున సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి.
ఇప్పటికే పాకిస్థాన్పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత ఆర్మీ విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా పాక్ క్షిపణులను ఎలా కూల్చారో తెలిసేలా వెస్ట్రన్ కమాండ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అగ్ని గోడలా భారత ఆర్మీ శత్రుదేశపు మిస్సైల్స్ను నేలమట్టం చేసిందని పేర్కొంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.