ఇండియా, పాకిస్తాన్ యుద్ధంతో మన దేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు బాగా తెలిసొచ్చాయి. ఇండియన్ ఆర్మీ అటాక్ చేసిన తీరుకు.. పాకిస్తాన్ మాత్రమే కాదు విదేశాలూ నోరెళ్లబెట్టాయి. పాక్ సంధించిన ఒక్క డ్రోన్ కూడా ఇండియాను తాకలేదు. అదే టైమ్లో భారత దాడికి దాయాది దేశం అల్లాడిపోయింది. పాక్ ఎయిర్బేస్లు, ఫైటర్ జెట్లు, రాడార్లు, ఎయిర్డిఫెన్స్ సిస్టమ్.. సర్వం సర్వనాశనం చేశాం. చైనా క్షిపణులు, టర్కీ డ్రోన్లను నేలమట్టం చేశాం. అదీ మన సత్తా. మన వెపన్స్ పవర్.
మేడిన్ ఇండియా వెపన్స్
S 400 మినహా భారత అమ్ములపొదిలోని మిగతా ఆయుధాలన్నీ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే. అన్నిటిలోకి బ్రహ్మోస్ వెరీ స్పెషల్. రష్యా సహకారంతో మనమే తయారు చేశాం. పాక్ ఎయిర్బేస్లు, రన్వేలపై విధ్వంసం సృష్టించింది. అందుకే, ఆ పవర్ఫుల్ వెపన్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. బ్రహ్మోస్ మాకు కావాలంటే మాకు కావాలంటూ పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
బ్రహ్మోస్కు ఫుల్ మార్కెట్
ఆపరేషన్ సింధూర్తో భారత ఆయుధ సంపత్తి సత్తా అందరికీ తెలిసొచ్చింది. మన క్షిపణులు, ఆయుధాలపై చాలా దేశాలకు ఆసక్తి పెరిగింది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కోసం ఏకంగా 17 దేశాలు చూస్తున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, దక్షిణాఫ్రికా, వియత్నాం, సింగపూర్ దేశాలు అప్పుడే బేరాలు మొదలుపెట్టాయి. బ్రూనై, థాయిలాండ్, మలేషియా, చిలీ, ఇండోనేషియా, బ్రెజిల్ కూడా డీల్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అర్జెంటీనా, వెనిజులా, ఖతార్, ఒమన్, ఈజిప్ట్, బల్గేరియా దేశాలు కూడా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి గురించి ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం టాక్స్ దశలోనే ఉన్నాయి. ఒప్పందాలు కుదిరితే.. భారత్కు డాలర్ల పంట పండినట్టే.
పవర్ఫుల్ వెపన్
బ్రహ్మోస్.. భారత్ డెవలప్ చేసిన అత్యంత శక్తివంతమైన క్షిపణి. నింగి, నేల, నీరుపై ఆధిపత్యం చెలాయించే ఆయుధం. బ్రహ్మోస్లో 4 రకాల వెరైటీలు ఉన్నాయి. యుద్ద విమానం నుంచి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణి అందులో ఒకటి. ఇదే పాక్తో యుద్ధంలో బీభత్సం సృష్టించింది. సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి దీనిని ప్రయోగించారు. భూమిపై నుంచి కూడా సంధించగల మరో రకం బ్రహ్మోస్ కూడా ఉంది. యుద్ధ నౌకల కోసం మరో తరహా బ్రహ్మోస్ తయారు చేశారు. జలాంతర్గామి నుంచి.. నీటిలో నుంచి నీటితో ప్రయోగించే సత్తా కలిగిన బ్రహ్మోస్ కూడా ఉంది. ఇలా ఒకే క్రూయిజ్ క్షిపణిని నాలుగు విధాలుగా ఆపరేట్ చేయగల అనుకూలత ఉండటం చాలా అరుదు. రాడార్కు దొరకకుండా స్టెల్త్ టెక్నాలజీతో దీనిని తయారు చేశారు. మాక్ 3 సూపర్సోనిక్ వేగంతో ఇది దూసుకుపోతుంది. అడ్వాన్స్డ్ గైడెడ్ సిస్టమ్ ఉంది. అణ్వాయుధాలనూ మోసుకెళ్లగలదు. అందుకే, బ్రహ్మోస్ అంత స్పెషల్. ప్రపంచ మార్కెట్లో ఫుల్ డిమాండ్.
డబ్బులిస్తాం.. దున్నేయండి..
మరోవైపు, డిమాండ్కు అనుగుణంగా భారత్ సైతం తన రక్షణ బడ్జెట్ పెంచేందకు రెడీ అవుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు మారిపోవడంతో.. ఇప్పటికే రక్షణశాఖకు కేటాయించిన రూ.6.81 లక్షల కోట్లకు అదనంగా.. మరో రూ.50 వేల కోట్లు కేటాయించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తగా కేటాయించే మొత్తాన్ని డిఫెన్స్ పరిశోధనలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుకు ఉపయోగించనున్నారు.