“నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. నీళ్ల కోసం మొదలైన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది.. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగం అంటే అది ఒక భావోద్వేగం” అని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈ, జేటీవో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. గడిచిన 15 నెలల్లో నీటి పారుదల శాఖలోనే 1,161 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు. గ్రూప్ 1 నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో అందరికీ తెలుసని.. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
ఆ నిధులు ఎవరి జేబుల్లోకి?
భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయని విమర్శించారు సీఎం రేవంత్. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ వచ్చి పదేళ్లు అయినా ఇంకా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీశారు. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో తన ప్రభుత్వం పనిచేస్తోందని.. అందుకే నీటి పారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు.
ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి..
ఆనాడు నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతోనే ఇప్పటికీ మనకు నీళ్లు అందుతున్నాయని గుర్తు చేశారు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని.. కానీ, కట్టిన మూడేళ్లలోనే కుప్పకూలిన ప్రాజెక్టు కేవలం కాళేశ్వరం మాత్రమేనని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజినీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇలా తయారైందన్నారు. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలన్నారు సీఎం రేవంత్.
అదే బిగ్గెస్ట్ సెంటిమెంట్
ఎవరి నిర్లక్ష్యంతో SLBC పూర్తి కాలేదో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటిమెంట్ నీళ్లు అని.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలని ఇంజనీర్లకు సూచించారు. ఎస్ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి.
కాళేశ్వరం NDSA రిపోర్ట్పై సమీక్ష
మరోవైపు, హైదరాబాద్ జలసౌదాలో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరంపై NDSA రిపోర్ట్, బ్యారేజీల పునర్నిర్మానంపై మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో చర్చించారు. కృష్ణా, గోదావరి జలాలపై సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సీతమ్మ సాగర్, సీతారామ ఎత్తిపోతల అనుమతులు, నిర్మాణం పురోగతి.. డిండి, మున్నేరు–పాలేరు అనుసంధాన కాలువలపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్వహణకు పెండింగ్ నిధులు మంజూరు చేశారు సీఎం రేవంత్రెడ్డి.