భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేసింది దాయాది దేశం పాకిస్తాన్. భారత్పై కనిపించని దాడులు చేసింది. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 15 లక్షలు దాడులు చేసింది. అందులో 150 మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఇంతకీ ఆ దాడులు ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
భారత్ను దెబ్బ తీయడానికి రకరకాల కుట్రలు చేస్తోంది పాకిస్తాన్. కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. ఆపై సరిహద్దుల వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ రెండు మార్గాలనే కాకుండా మూడో విధంగా దెబ్బ తీయాలని ప్లాన్ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఎవరూ ఊహించని విధంగా భారీ సైబర్ ఎటాక్స్కు దిగింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన హ్యాకర్లు దేశవ్యాప్తంగా 15 లక్షల సైబర్ దాడులు జరిపినట్లు మీడియా రిపోర్టులు బయటకు వస్తున్నాయి. వీటి గురించి తెలియగానే దాయాది దేశం ఏ స్థాయిలో కుట్రకు పాల్పడుతుందో అర్థమవుతుంది. కుల్గావ్ బద్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్ వెబ్సైట్ను డ్యామేజ్ చేసినట్లు అధికారుల మాట. దీనితోపాటు జలంధర్లోని డిఫెన్స్ నర్సింగ్ కళాశాల వెబ్సైట్ దాడుల బారిన పడింది.
పాకిస్తాన్ సైబర్ ఎటాక్స్పై స్పందించారు మహారాష్ట్ర సైబర్ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్పై పాకిస్తాన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. ఇప్పటి వరకు 15 లక్షల సైబర్ దాడులు జరిగనట్టు తేల్చారు. కాకపోతే వీటిలో 150 మాత్రమే విజయవంతం అయ్యాయి. మిగతా వెబ్సైట్ల విషయంలో ఫెయిల్ అయ్యాయి.
కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సైబర్ దాడులు కంటిన్యూ అవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వానికి చెందిన వెబ్ సైట్లను ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులు చేసిందన్నారు. పాకిస్తాన్ మాత్రమే కాదని, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాకో నుంచి సైబర్ దాడులు కొనసాగుతున్నాయి. ముంబై ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన డేటాను హ్యాకర్లు దొంగలిస్తున్నట్లు వార్తలు లేకపోలేదు.
అలాగే ఎలక్షన్ కమిషన్కి చెందిన వెబ్సైట్ను వదల్లేదు. కాల్పుల విరమణ తర్వాత సైబర్ దాడులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అలాగని పూర్తిగా ఇంకా ఆగలేదని నిపుణులు చెబుతున్నారు. పాక్తో సంబంధం ఉన్నవారు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. మాల్వేర్ క్యాంపైన్స్, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్-DDOS, జీపీఎస్ స్పూఫింగ్ వంటి సైబర్ దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు.