భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్లోని సంకీర్ణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. జులై 1న ప్రారంభం కానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావర్ భుట్టో జర్ధారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రధాని షెహబాజ్ షరీఫ్తో బడ్జెట్పై చర్చించేందుకు సోమవారం సమావేశమైంది. పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీపీపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సమావేశంలో రూ.17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్కు రూపకల్పన చేస్తూ రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచేందుకు అంగీకరించారు.
2024-25లో రక్షణ శాఖకు రూ.2,122 బిలియన్లను కేటాయించగా, ఈసారి అది రూ.2.5 ట్రిలియన్లు దాటనుంది. పాకిస్థాన్ కేటాయింపుల్లో రక్షణ శాఖ బడ్జెట్ రెండో అతి పెద్ద వ్యయం. అప్పులు తిరిగి చెల్లించేందుకు చేస్తున్న వ్యయం తొలి స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాదిలో రుణ చెల్లింపులకు రూ.9,700 బిలియన్లు కేటాయించింది.
దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నా.. దేశ ప్రజల బాగోగులు పక్కన పెట్టి సైన్యాన్ని బలోపేతం చేయడం కోసం పాక్ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచడం భారత్కు భయపడేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.