AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టెర్రరిస్ట్ లకు హోం శాఖ మంత్రి అమిత్ షా మాస్ వార్నింగ్..! చున్ చున్ కే బదలా లేంగే..

పహల్గాం ఉగ్ర దాడిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తొలిసారి బహిరంగంగా స్పందించారు. టెర్రరిస్ట్ లకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చున్ చున్ కే బదలా లేంగే అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు అమిత్ షా. ఇది మోదీ ప్రభుత్వం.. ఆ విషయం గుర్తుంచుకోండి అంటూ హాట్ కామెంట్స్ చేశారాయన.

 

ఇది మోదీ సర్కార్..

ఢిల్లీలోని బోడోఫా ఉపేంద్ర నాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. బహిరంగ సభలో పహల్గాం అటాక్ పై స్పందించారు. పాకిస్తాన్ కి ఈ సారి భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారాయన. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల్లో ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదని, ఎక్కడున్నా వెంటాడతామని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిని ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పహల్గాం దాడికి పాల్పడినవారు దాన్ని ఓ విజయంగా భావించి ఉండొచ్చని, కానీ వారు ఒక విషయం గుర్తుంచుకోవాలని, ఇది మోదీసర్కారు అని చెప్పారు అమిత్ షా. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

 

జీరో టాలరెన్స్..

ఉగ్ర మూకల్ని ఇక ఉపేక్షించేది లేదన్నారు అమిత్ షా. కేవలం దాడికి గురైన కుటుంబాలే కాదని, యావత్ భారత దేశం ఈ దాడి తర్వాత దుఃఖాన్ని అనుభవించిందని చెప్పారు. ఉగ్రవాదం పట్ల మన ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుందన్నారు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా ఉగ్రవాదం మనుగడ సాగించడానికి వీల్లేదని, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించివేస్తామన్నారు అమిత్ షా.

 

అటు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునే సందర్భం కోసం వేచి చూస్తోంది. పాక్ కి సహాయ నిరాకరణ కొనసాగిస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని ఆయన చెప్పారు. టైమ్, డేట్ వారే ఫిక్స్ చేయాలని చెప్పారు. పాకిస్తాన్ కు ఎలాంటి జవాబివ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందన్నారు మోదీ. పహల్గాం ఘటనపై ఇప్పటికే చాలామంది స్పందించినా.. హోం మంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలే ఇప్పుడు వైరల్ గా మారాయి. ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదులందర్నీ వెదికి మరీ మట్టుబెడతామని హెచ్చరించారు అమిత్ షా. భారతీయులు కూడా ఉగ్రదాడులపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా నష్టపోయామని, ఇకపై ఎలాంటి నష్టం జరగడానికి వీలు లేదంటున్నారు. ఉగ్రమూకల్ని మట్టుబెడితేనే కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రజలు తమ సందేశాల్ని ఉంచుతున్నారు. పాకిస్తాన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అంటున్నారు. పాక్ పై ప్రతీకారం కోసం భారత ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పోస్టింగ్ లు పెడుతున్నారు. ప్రభుత్వం కూడా ఉగ్రమూకల ఆట కట్టించడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ని ఒంటరిగా మార్చేందుకు దౌత్యపరమైన చర్యలకు కూడా సిద్ధపడుతోంది. పాకిస్తాన్ ఆర్థిక మూలాలను కట్టడి చేయడంతోపాటు, పరోక్ష సహకారం అందించే దేశాలపై కూడా కన్నేసి ఉంచడం మన తక్షణ కర్తవ్యం. అది సాధ్యమైనప్పుడే పాకిస్తాన్ మరింత బలహీనపడుతుంది. తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేస్తుంది.

ANN TOP 10