AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్ కు ఎఫ్-35 యుద్ధ విమానాలు అందించేందుకు సిద్ధం: జేడీ వాన్స్..

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చల విధివిధానాలు ఖరారయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. తన భారత పర్యటనలో భాగంగా జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీల దార్శనికతను సాకారం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. అమెరికా, భారత్ రెండూ అభివృద్ధి చెందాలని ట్రంప్ కోరుకుంటున్నారని వాన్స్ స్పష్టం చేశారు.

 

భారత్‌తో న్యాయమైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ట్రంప్ ప్రభుత్వం కోరుకుంటుందని, భాగస్వామ్య దేశాలతో మంచి ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉందని వాన్స్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా ఇంధనంతో పాటు, అత్యాధునిక ఎఫ్35 యుద్ధ విమానాలను విక్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన సూచనప్రాయంగా తెలిపారు.

 

సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకున్న జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌లకు రాజస్థాన్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మంగళవారం ఉదయం వారు చారిత్రక ఆమెర్ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారి వారికి స్వాగతం పలికారు. అలంకరించిన ఏనుగులు, రాజస్థానీ సంప్రదాయ నృత్యాలు, కళారూపాలతో వాన్స్ కుటుంబానికి ఆత్మీయ ఆహ్వానం లభించింది. వారి పర్యటన నేపథ్యంలో ఆమెర్ కోటను సందర్శకులకు 24 గంటల పాటు మూసివేశారు.

 

అంతకుముందు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జేడీ వాన్స్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. రక్షణ సహకారం, ఇంధనం, ఆధునిక సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.

 

భారత్‌కు తాము భాగస్వాములుగా వచ్చామని, సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని జైపూర్ ప్రసంగంలో వాన్స్ అన్నారు. “గతంలో కొన్నిసార్లు వాషింగ్టన్ ప్రధాని మోదీకి బోధించే వైఖరితో వ్యవహరించింది. మేము దానికోసం ఇక్కడకు రాలేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణ అమోఘమని, ఆయన రేటింగ్‌లు తనకు అసూయ కలిగించేలా ఉన్నాయని తాను మోదీతో అన్నట్లు వాన్స్ తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10