వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. నేడు మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు.
గతంలో ఇంటి పట్టాల కోసం చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోలేదు
దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఇక్కడి ప్రజలు కోరారు. ఏడాదిలోగా బట్టలు పెట్టి మొదటి దశ ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పా. 11 నెలల్లో హామీని నిలబెట్టుకునేందుకే మీ ముందుకు వచ్చా. గతంలో ఇంటి పట్టాల కోసం చెప్పులరిగేలా తిరిగారు. జిరాక్స్ లకు, అర్జీలకే వేలరూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన కొలతలు తీశాం. ఆ వివరాలన్నీ వచ్చిన వెంటనే కేబినెట్ లో చర్చించి పాలసీ తీసుకువచ్చాం.
రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు
వచ్చే వారం నుంచి ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెండేళ్లలో పట్టాను అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది. దయచేసి ఎవరూ అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతాం. ఇందుకు మీ అందరి సహకారం కావాలి. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. మీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తా.