AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్… నెల్లూరు జైలుకు తరలింపు..

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు ఇవాళ గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మాధవ్ కు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్‌ నేపథ్యంలో ఆయనను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. మాధవ్‌తో పాటు మరో ఐదుగురు నిందితులకు కూడా కోర్టు రిమాండ్ విధించింది.

 

వివరాల్లోకి వెళితే… వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలిస్తుండగా, మాధవ్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గుంటూరులోని చుట్టుగుంట జంక్షన్ వద్ద తన కారును అడ్డుగా ఉంచి, కిరణ్‌కుమార్‌పై దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆయన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు.

 

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం, పోలీసులు మాధవ్‌ను ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మాధవ్ తరపున వాదించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రిమాండ్‌ను తిరస్కరించాలని కోరారు, కానీ కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది.

 

కోర్టు ఆవరణలో కూడా మాధవ్ దురుసుగా ప్రవర్తించారని సమాచారం. పోలీసులు కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఆయన మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించారు. ఎంపీగా పనిచేసిన నన్ను మీడియా ముందుకు తీసుకువస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ANN TOP 10