కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కూడా అయిన నితిన్ గడ్కరీ దేశంలో పెరిగిపోతున్న కుల రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కులం గురించి మాట్లాడే వారిపై మండిపడ్డారు. కులం పేరెత్తితే కొడతానంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గడ్కరీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
నాగ్పూర్లో తాజాగా జరిగిన సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. ఇందులో గడ్కరీ.. సమానత్వం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశారు. అలాగే దేశంలో కుల ఆధారిత రాజకీయాలను విమర్శించారు. ఒక వ్యక్తి విలువను కులం, మతం, భాష, లింగం ఆధారంగా కాకుండా వారి లక్షణాల ద్వారా నిర్ణయించాలని గడ్కరీ అన్నారు. అందుకే మనం కులం, వర్గం, మతం, భాష లేదా లింగం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపకూడదని ఆయన తెలిపారు.
కులం పేరెత్తితే కాలుతో తంతానని ఓ 50 వేల మంది పాల్గొన్న కార్యక్రమంలో తాను చెప్పినట్లు గడ్కరీ గుర్తుచేశారు.తాను ఇలా మాట్లాడటం ద్వారా రాజకీయంగా ఇబ్బందుల్లో పడొచ్చని తన స్నేహితులు చెప్పారని, కానీ తాను దాని గురించి ఆందోళన చెందడం లేదని గడ్కరీ వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎవరూ తమ ప్రాణాలను కోల్పోరని, తాను తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని గడ్కరీ తేల్చిచెప్పేశారు. కుల ఆధారిత గుర్తింపు రాజకీయాల్లో గణనీయమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, అది తన ఓట్లు పొగొట్టినప్పటికీ తాను అలాంటి వాటికి దూరంగా ఉంటానన్నారు.