తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈసారి సీబీఐటీ ఏడాది ఫీజును రూ.2.23 లక్షలుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఆ కాలేజీలతో పాటు వీఎన్ఆర్, ఎంజీఐటీ తదితర కళాశాలలకు కూడా ట్యూషన్ ఫీజు రూ.2 లక్షలకు చేరుకున్నట్లు సమాచారం. వచ్చే మూడేళ్ల బ్లాక్ పిరియడ్కు కొత్త ఫీజులను ఫిక్స్ చేసేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గత నెల 25వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కళాశాలల యాజామాన్యాలు, ప్రతినిధులతో విచారణ జరిపింది. కాలేజీలు గతంలో సమర్పించిన గత మూడేళ్ల ఆడిట్ నివేదికలను పరిశీలించి కొత్త ఫీజులను యాజమాన్య ప్రతినిధులకు కమిటీ తెలియజేసింది. దాదాపు అన్ని కాలేజీల యాజమాన్యాలు కమిటీ చెప్పిన ఫీజుకు ఒప్పుకున్నాయి.
అయితే, కొన్ని కాలేజీలకు భారీగా పెరగగా, మరికొన్నిటికి నామమాత్రంగానే పెరిగాయి. గతంలో సాంకేతిక కారణాల వల్ల కొన్ని ప్రముఖ కళాశాలలకు తక్కువ ఫీజు పెంచారని. దాని వల్ల ఈసారి ఆ కాలేజీలకు ఎక్కువగా పెరిగాయని పేర్కొన్నారు. ఇక, ఖరారు చేసిన ఫీజును కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. దాన్ని సర్కార్ పరిశీలించి జీవో జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ ఫీజులు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే పునఃసమీక్ష చేయాలని సూచనలు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులు ఇలా ఉన్నాయి
కళాశాల పేరు- పాత ఫీజు- కొత్త ఫీజు
* సీబీఐటీ- రూ.1.65 లక్షలు- రూ.2.23 లక్షలు
* వీఎన్ఆర్- రూ.1.35 లక్షలు- రూ.2.20 లక్షలు
* వాసవి- రూ.1.40 లక్షలు- రూ.2.15 లక్షలు
* ఎంజీఐటీ- రూ.1.60 లక్షలు- రూ.2 లక్షలు
* సీవీఆర్- రూ.1.50 లక్షలు- రూ.1.98 లక్షలు
* ఎంవీఎస్ఆర్- రూ.1.30 లక్షలు- రూ.1.60 లక్షలు
* మాతృశ్రీ- రూ.లక్ష- రూ.1.02 లక్షలు
* జేబీఐటీ- రూ.1.10 లక్షలు- రూ.1.15 లక్షలు
* జేబీఆర్ఈసీ- రూ.87 వేలు- రూ.1.06 లక్షలు
* స్టాన్లీ మహిళ- రూ.85 వేలు- రూ.95 వేలు
* మెథడిస్ట్- రూ.78 వేలు- రూ.86 వేలు