AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“నన్ను తేలిగ్గా తీసుకోవద్దు – ప్రభుత్వాన్ని కూలగొట్టిన వాడిని” ఏక్ నాథ్ షిండే వార్నింగ్..

మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వంలో సఖ్యత లేదని, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలోని తన పాత్రపై అసంతృప్తిగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో.. షిండే కీలక వార్తలు చేశారు. ఎవరైనా సరే నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. నన్ను మీరు తేలిగ్గా చూసినప్పుడే 2022లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని మార్చేసిన వాడిని.. అంటూ హెచ్చరించినట్లుగా వ్యాఖ్యానించారు. దీంతో.. ఇప్పుడు ఈ వార్తలు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే ఎందుకు ఈ మాటలు అన్నారు, ఆయన ఏం చేయనున్నారనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

 

‘‘నేను ఓ సాధారణ పార్టీ కార్యకర్తను. కానీ నేను బాబాసాహెబ్‌ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని. ప్రతి ఒక్కరు దీన్ని తప్పక అర్థం చేసుకోవాలి. 2022లో అందరూ నన్ను తేలిగ్గా తీసుకున్నప్పుడు.. అప్పటి ప్రభుత్వాన్ని పడగొట్టేశా, ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాను.” అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో మహాయుతి ప్రభుత్వంలో విభేధాలు తలెత్తాయని, ఏక్ నాథ్ షిండి.. కొన్నాళ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారన్న ఊహాగానాల మధ్య జరగడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని.. ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిలిపివేయడంతోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

బయటపడుతున్న విభేదాలు

 

క్రితం సారి ఎన్నికల్లో శివసేనా పార్టీని రెండుగా చీల్చి అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన ఏక్ నాథ్ షిండే.. గత కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై, ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ చర్యలతో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. అందుకే.. సీఎం నిర్వహిస్తున్న ఎలాంటి సమావేశాలకు ఏక్‌నాథ్‌ షిండే హాజరుకావడం లేదు. అలాగే.. షిండే వర్గం ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించారు. దీంతో.. వారంతా షిండే దగ్గర తమకు ఎదురవుతున్న వివక్షను ప్రస్తావించారని.. దాంతో మరింతగా షిండే అసంతృప్తిగా ఉన్నారంటూ చెబుతున్నారు. ఈ తరుణంలోనే.. రాష్ట్ర సచివాలయంలో బీజేపీ, శివసేనా పార్టీలు వారి ఎమ్మెల్యేల కోసం వేర్వేరుగా వైద్య సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు.

 

ఎవరి బలమెంత.?

 

మహారాష్ట్రలో మూడు పార్టీలు భాజపా-శివసేన-ఎన్సీపీల సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గతంలోనూ భాజపా, ఎన్సీపీ, శివసేనా పార్టీలు అధికారాన్ని పంచుకోగా.. అప్పుడు షిండే వర్గం ఎక్కువగా ఉండడంతో.. ఏక్ నాథ్ షిండ్ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగారు. కానీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 132 స్థానాల్లో విజయం సాధించి, అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీని తర్వాత శివసేన 57, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నారు. దాంతో.. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దాంతో.. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లు ఉప ముఖ్యమంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు. కానీ.. వివిధ కారణాలతో మహాయుతి కూటమిలో విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయని విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఏక్ నాథ్ షిండే “నన్ను తక్కువగా తీసుకోవద్దు” అనే డైలాగ్ తో.. మహారాష్ట్ర ప్రభుత్వలో ఏమవుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఏక్ నాథ్ షిండే వివరణ ఏంటి.?

 

ఇటీవల ఓ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంలోని విభేధాలపై స్పందించిన ఏక్ నాథ్ షిండే.. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో తనకు ఎలాంటి కోల్డ్‌ వార్‌ లేదని చెప్పారు. తనకు కేవలం అభివృద్ధిని అడ్డుకునే వారితోనే పోరాటమన్నారు. తేలిగ్గా తీసుకోవద్దనే వ్యాఖ్యల అనంతరం.. మహారాష్ట్ర విధాన సభలో మొదటి ప్రసంగంలో రాష్ట్రంలో బీజేపీకి గత ఎన్నికల్లో 200 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పానని.. అలాగే 232 సీట్లు సాధించారని వెల్లడించారు. రాజకీయాల్లో తనను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని, ఇది ఎవరిని ఉద్దేశించి చెబుతున్నానో వాళ్లు అర్థం చేసుకుంటారంటూ పరోక్షంగా, నిగూఢంగా హెచ్చరిక లాంటి మాటలు మాట్లాడారు. దీంతో.. మీడియా ముందు ఒకలా, విధాన సభలో మరోలా ఎందుకు మాట్లాడారు, ఎవర్ని టార్గెట్గా ఇలాంటి మాటలు మాట్లాడారనే చర్య జోరుగా సాగుతుంది.

ANN TOP 10