ఏపీలో మళ్లీ ఉనికి చాటుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టేసిందా? ఓ వైపు నుంచి నేతలు వెళ్లిపోతుంటే.. మరోవైపు ఏపీ కాంగ్రెస్ నేతలతో జగన్ రాయబారం చేస్తున్నారా? బెంగుళూరు వేదికగా చర్చలు కొంతవరకు ఫలితాలను ఇస్తున్నాయా? జగన్ చేస్తున్న ప్రయత్నాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఈ సామెతను నేతలు పదేపదే గుర్తు చేస్తున్నారు. మారిన రాజకీయాలకు ఈ సామెత అతికినట్టు సరిపోతోంది. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పనైపోయిందని భావించారు. నేతలు సైతం వలసపోవడంతో ఆ పార్టీ మనుగడ కష్టమనన్న వాదన ఆ పార్టీల నేతల్లో బలంగా వినిపిస్తోంది.
వెళ్లిపోతున్న నేతలకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ లేదని మూడురోజుల కిందట మీడియా ముఖంగా చెప్పేశారు జగన్. ఆ తర్వాత కొందరు నేతలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ లొల్లి కొనసాగుతుండగానే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు ఆ పార్టీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
బెంగుళూరు వేదికగా ఏపీలో కొందరు హార్డ్కోర్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపు తున్నారట జగన్. ఏపీ విభజన తర్వాత కొందరు కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. మరొకొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలను గమనిస్తున్న జగన్, వైఎస్ఆర్ను ఆరాధించే నేతలపై వల వేసినట్టు సమాచారం. వారితో ఆయన జరుపుతున్న మంతనాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలంతా టీడీపీతోపాటు బీజేపీకి బద్ద శత్రువులు కూడా. వారిలో ఒకరు సాకే శైలజానాథ్. ఇటీవల వైసీపీ కండువాను కప్పుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ, మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఫ్యాన్ వైపు అడుగులు చూస్తున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరు కేంద్రంగా ఆయనతో జగన్ జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఉగాదిలోపు ఆయన వైసీపీలో జాయిన్ కావడం ఖాయమని అంటున్నారు.
జగన్ తన ఆలోచనతో వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములాను అమలు చేసినట్టు కనిపిస్తోంది. ఓ వైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను దెబ్బకొట్టడం. మరోవైపు టీడీపీ బద్ద వ్యతిరేకులను కూడదీయడంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తొలుత సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని జగన్ భావించారు.
నేతలు వలస పోవడంతో ఆలోచన పడ్డారు జగన్. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ హార్డ్ కోర్ నేతలు వచ్చారు. ఈ క్రమంలో ఉగాది నుంచి జిల్లాల బాట పట్టాలన్నది జగన్ ఆలోచనగా వైసీపీ నేతల మాట. ఉండవల్లి వస్తే పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని భావిస్తోంది ఆ పార్టీ. గతంలో మాదిరిగా ఉండవల్లి బ్యాలెన్స్గా మాట్లాడుతారా? అన్నదే అసలు పాయింట్. కొన్నాళ్లుగా మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ ఆయన వైసీపీతోపాటు టీడీపీని దుమ్మెత్తి పోసిన విషయం తెల్సిందే.