ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పీఆర్సీ ఏర్పాటు పై నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘానికి కొత్త ఛైర్మన్.. ఇద్దరు సభ్యుల నియామకానికి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బడ్జెట్ కు ముందే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 53 శాతానికి పెరిగిన తరుణంలో కొత్త పీఆర్సీ చర్చలు.. ప్రతిపాదనల పైన భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న భత్యాల తో ఫిట్ మెంట్ సిఫార్సు ల పైన స్పష్టత వస్తోంది.
తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త పీఆర్సీ పైన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో కాలంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచి చూస్తున్న ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ కమిషన్ వచ్చే ఏడాది అంటే 2026 నాటికి తన నివేదికను సమర్పించనుంది. ప్రస్తుతం అమలు లో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్తో 10 సంవత్సరా లు పూర్తి కానుంది. కాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువు కంటే ముందుగానే ఎనిమిదో వేతన సంఘ నియామకం పైన నిర్ణయం తీసుకుంది.
ఈ 8వ వేతన సంఘం సిఫార్సుల పైన ఉద్యోగ సంఘాలు భారీ అంచనాలతో ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న డీఏ ను పరిగణలోకి తీసుకొని ఏ మేర సిఫార్సులు ఉంటాయనే అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.86గా నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ద్వారా ఉద్యోగుల కనీస బేసిక్ జీతంలో పెరుగుదల భారీగా ఉంటుంది. కనీస వేతనం రూ.51,480 ఉండే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం కనీస మూల వేతనం రూ.18,000గా అమలు చేస్తున్నారు. అదే విధంగా పెన్షనర్ల కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ.9,000 నుండి రూ.25,740కి పెరిగే ఛాన్స్ ఉంది. కేంద్ర ఉద్యోగుల వేతనాన్ని నిర్ణయించడంలో ఈ ఫిట్మెంట్ అంశం కీలకంగా మారనుంది.
గతంలో కేంద్రం ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2.57 ఫిట్మెంట్ అమలు చేస్తున్నారు. దీంతో ఈ సారి ఏ మేర పే రివిజన్ కమిషన్ సిఫార్సులు ఉంటాయనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది. గతం కంటే ఎక్కువ ఉంటుందని చెబుతున్నా… వాస్తవ పరిస్థితుల పన ఉద్యోగ సంఘాలు లెక్కలు వేస్తున్నాయి. ఇక, ఈ సారి కనీస వేతనంలోనూ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కాగా, ఢిల్లీ – బీహార్ ఎన్నికల వేళ కేంద్రం ఉద్యోగులను తమ వైపు తిప్పుకొనే క్రమంలో భాగంగా బడ్జెట్ కంటే ముందుగానే 8వ పీఆర్సీ నియామకం పైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లోగా ఈ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.