AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న్యూ ఇయర్‌ వేడుకలకు దూరంగా ఉండండి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

న్యూఇయర్‌ వేడుకల వేళ.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమైన వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కీలక సూచనలు చేశారు.

దేశం మొత్తం న్యూఇయర్‌ వేడుకలకు సిద్ధమైంది. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో న్యూఇయర్‌ జోష్‌ నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం నుంచే యువత బైక్‌ లతో రోడ్లపై సందడి చేశారు. మరోవైపు ఈవెంట్స్‌ నిర్వాహకులు పలు ప్రాంతాల్లో ఈవెంట్స్‌ ఏర్పాటు చేసి న్యూఇయర్‌ వేడుకల జోష్‌ ను అమాంతం పెంచేశారు. పబ్‌ లు, క్లబ్‌ ల నిర్వహకులు సరికొత్త ఆఫర్లతో న్యూఇయర్‌ వేడుకలను క్యాష్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో న్యూ ఇయర్‌ వేడుకలకు దూరంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పిలుపునిచ్చారు. ‘జనవరి ఫస్ట్‌ నూతన సంవత్సరం కాదు. హిందువులకు కొత్త సంవత్సరం అంటే మార్చి నెలలో వచ్చే ఉగాది పండుగనే. జనవరి ఫస్ట్‌ క్యాలెండర్‌ మారుతుంది తప్ప మన ఫ్యూచర్‌ కాదు. మన ప్యూచర్‌ ని నిర్ణయించేది ఉగాది పండుగనే. చాలా మంది యువత డిసెంబర్‌ 31రాగానే పబ్బులు, బార్లు, గోవా అంటూ తిరుగుతారు. రోడ్లపై ఇష్టానుసారంగా బైక్‌ రైడ్స్‌ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మనం ఇలానే జరుపుకొంటూపోతే మన పిల్లలు పండుగ అంటే ఇలానే జరుపుకువాలనే ప్రమాదం ఉంది. ప్రజలు ఈ విషయాలను గమనించి డిసెంబర్‌ 31, జనవరి 1 వేడుకలకు దూరంగా ఉండండి. ఉగాది పండుగను వైభవంగా జరుపుకోండి’ అంటూ రాజాసింగ్‌ పిలుపునిచ్చారు.

మరోవైపు పోలీసుల హెచ్చరికలు..
మరోవైపు న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. మద్యం సేవించి వాహనం నడిపినా, రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. న్యూ ఇయర్‌ వేడుకలను ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ANN TOP 10