కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను నాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. కాగా, అనిత భర్త అనిల్, సైదులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నాచారం సరస్వతినగర్లో పులివర్తి దీప్తి (29) తన తల్లితో కలిసి నివసిస్తున్నది. ఎమ్మెస్సీ చదివిన దీప్తి హబ్సీగూడలోని ఐఐసీటీలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పనిచేసి రిటైరయ్యాడు. రెండేండ్లుగా ఆయన తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. వీరి ఇంటికి సమీపంలో ఉండే డీజీపీ కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్ అనిల్ నివసిస్తున్నాడు. అతనికి సంగీతరావుకు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే అనిల్ భార్య అనితకు ఉద్యోగం ఇప్పిస్తానని సంగీతరావు రెండేళ్ల క్రితం రూ.15 లక్షలు తీసుకున్నాడు. పలుమార్లు అడుగడంతో రూ.7 లక్షలు ఇచ్చాడని, ఇంకా ఇవ్వాల్సిన రూ.8 లక్షలను ఇవ్వడంలేదనీ నాచారం పోలీస్స్టేషన్లో అనిల్ ఫిర్యాదు చేశాడు.
ఈ విషయమై పోలీసులు సంగీతరావు భార్యను, ఆయన కూతురు దీప్తిని విచారణ కోసం పోలీస్స్టేషన్కు పిలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దీప్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తన తండ్రి తీసుకున్న డబ్బు విషయమై తనను పోలీస్స్టేషన్కు పిలిపించి అడగడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను చిత్రీకరించింది. తన మరణానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్యనే కారణమని అందులో పేర్కొన్నది.