ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్
గ్రూప్ –1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. గ్రూప్–1 అభ్యర్థుల పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై హైకోర్టును గ్రూప్–1 అభ్యర్థులు ఆశ్రయించారు. వారి పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇప్పటికే గ్రూప్–1 పరీక్షలు పూర్తి అయ్యాయి. దీంతో రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్–1 ఫలితాలను ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
కాగా.. జీవో నెంబర్ 29తో పాటు పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్ – 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థులు కోరారు. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆఖరి నిమిషంలో పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీం కూడా తేల్చిచెప్పింది. హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది. ఆ తరువాత రేవంత్ సర్కార్ గ్రూప్–1 పరీక్షలను యథాతథంగా నిర్వహించింది. హైకోర్టు తీర్పుతో గ్రూప్ –1 ఫలితాలకు ఆటంకం తొలగినట్లయింది.
పరీక్షలు రద్దు చేయాలంటూ గతంలోనూ..
ఇదిలా ఉండగా… ముందుగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ అభ్యర్థులు హైకోర్టు సింగిల్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. దీంతో రెండు రోజులకే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు డివిజన్ బెంచ్లో పిటిషన్∙వేశారు. గ్రూప్–1 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను డివిజన్∙బెంచ్ కూడా కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో డివిజన్ బెంచ్ ఏకీభవించింది. దీంతో గ్రూప్ –1 పరీక్షలకు అడ్డంకులు తొలగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను నిర్వహించింది. ఈఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్–1 పరీక్షల ఫలితాలను ఆపాలంటూ అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్ను గురువారం హైకోర్టు కొట్టివేసింది.