తెలంగాణవాసులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండగ కానుకను ప్రకటించింది. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంగళవారం తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల సర్వేలో వేగం పెరిగిందని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి తేల్చి చెప్పారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 32 లక్షల దరఖాస్తుల సర్వే పూర్తి చేసినట్లు వెల్లడించారు. సర్వే పూర్తి చేసిన వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేసినట్లు వెల్లడించారు.
మరికొన్ని రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి పండగ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ను తిరిగి బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాల్లో ఉన్న కార్పొరేషన్ ఉద్యోగులను 95 శాతం వెనక్కి తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.