మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గురవడంపై దాఖలైన పిటిషన్పై భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. అలాగే ఫిర్యాదుదారుడికి కోర్టు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
కాగా.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కేసీఆర్, హరీశ్రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై రాజలింగం అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన భూపాల్లి కోర్టు.. కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు, అలాగే బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులకు జూలై 10న నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలంటూ కేసీఆర్, హరీష్ రావులను భూపాలపల్లి కోర్టు ఆదేశించింది.
అయితే భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్, హరీష్రావులు హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. కేసీఆర్, హరీశ్రావు వేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయడంతో పాటు ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.