సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను తల్లిదండ్రులు హాస్టళ్లలో చేరుస్తున్నారని, విద్యార్థుల మృతిపై మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ప్రతినెల 10వ తేదీ లోపు గ్రీన్ఛానల్ ద్వారా అన్ని విద్యాసంస్థలకు నిధులు వస్తాయిని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కామన్ డైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చిరుకూరిలోని గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు అంటే.. బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, హాస్టల్స్ లలో ఒకే విధంగా మెనూ తయారు చేస్తున్నారని ఆయన అన్నారు.
గురుకులాలు వ్యవస్థ అనేది పీవీ నరిసింహ రావు హయాంలో తీసుకొచ్చారని సీఎం గుర్తు చేశారు. ఈమధ్యనే డైట్ ఛార్జీలు పెంచామన్నారు. పాఠశాలలో విద్యార్ధుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు బాగున్నాయని ఆయన తెలిపారు. గురుకులాల్లో విద్యార్ధులకు సరికొత్త డైట్ ప్లాన్ చేస్తామన్నారు. తెలంగాణలోని సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.