AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

70వ వసంతంలోకి ఆధునిక దేవాలయం

తెలుగు రాష్ట్రాల సంజీవిని నాగార్జుసాగర్‌ డ్యాం
అన్నపూర్ణ రాష్ట్రాలుగా తీర్చిదిద్దిన రాతికట్టడం
లక్షల మంది శ్రేయాన్ని అక్షయం చేసిన శ్రమసౌధం

మానవమేదో వికాసానికి ప్రతీక. భారత దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక. శ్రమ శక్తిని రుజువు చేసిన కరదీపిక. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించిన అద్భుత నిర్మాణ సౌధం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు. అసమానమైన రాతి కట్టడంగా రూపు దాల్చిన శ్రమ సౌధం. లక్షల మంది శ్రేయాన్ని అక్షయం చేసిన శిలాక్షరమైన ఈ నవ దేవాలయానికి (డిసెంబర్‌ 10వ తేదీ) మంగళవారంతో 69 ఏళ్లు నిండి 70వ వడిలోకి అడుగుపెట్టింది.

మహోన్నతమైన మహా కట్టడం..
తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఈ మహా కట్టడం మహోన్నతమైన మానవ ప్రయత్నానికి మరుపురానిదిగా నిలుస్తోంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టు అవసరమని భావించి నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి పాలకులు నడుం బిగించారు. ఇంతటి అపురూపమైన ఈ ప్రాజెక్టుకు సరిగ్గా 69 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ 1955 డిసెంబర్‌ 10వ తేదీన నాగార్జునసాగర్‌ వద్ద శంకుస్థాపన చేశారు.

ఆనాటి ఆలోచన.. నేటి సాగర్‌ జలాశయం..
1900 సంవత్సరం నుంచి కృష్ణానదిపై రిజర్వాయర్‌ నిర్మించాలనే ఆలోచన నాటి బ్రిటిష్‌ పాలకులకు కలిగింది. కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకోవాలని తొలి నుంచి జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన ముక్త్యాల రాజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకలి చావులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని నవభారత నిర్మాత, తొలి భారత ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ నిర్ణయించారు. ఇందుకోసం తొలి పంచవర్ష ప్రణాళిక నుంచే సాగునీటి పథకాలు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే దక్షిణాదిన నాగార్జునసాగర్‌కు శ్రీకారం చుట్టారు

ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం..
1955 డిసెంబర్‌ 10వ తేదీ నుంచి రోజుకు 45 వేల మంది 12 ఏళ్ల పాటు శ్రమించారు. మొత్తం 19 కోట్ల 71 లక్షల మంది ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మితమైన కట్టడాన్ని ఆవిష్కరించారు. దీన్ని 1964లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువలకు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.98 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. ఇప్పుడైతే వేలకోట్ల రూపాయలు వెచ్చించినా సాధ్యం కాని పని.

ఆధునిక దేవాలయంగా నాగార్జుసాగర్‌..

భారత తొలిప్రధాని పండిట్‌ జనహర్‌ లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేసిన సందర్భంలో నాగార్జున సాగర్‌ను ‘ఆధునిక దేవాలయంగా’ అభివర్ణించారు. ధాన్యాగారంగా విరాజిల్లి, ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, గ్రామీణ ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి తోడ్పడింది. వ్యవసాయాభివృద్ధికి, దాని ద్వారా గ్రామీణ ఆర్థిక వికాసానికి సాగర్‌ జలాశయంతో బీజం పడింది.

ప్రాజెక్టు ప్రత్యేకతలు..
ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడంగా ఉన్న ఈ ప్రాజెక్టు 110 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన జలాశయం ఉంది. గరిష్ట నీటి స్థాయి మట్టం 590 అడుగులతో 408 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ఆనకట్ట 5 కిలోమీటర్ల పొడవు కాగా, ప్రధాన డ్యాం 1.7 కిలోమీటర్లు, కుడి ఎర్త్‌ డ్యాం 1.8 కిలోమీటర్లు, ఎడమ ఎర్త్‌ డ్యాం 2.5 కిలోమీటర్లు ఉంది. 26 క్రస్ట్‌ గేట్లతో అద్భుతంగా నిర్మించారు. ప్రపంచంలోనే అత్యధిక డిశ్చార్జి సామర్థ్యం కలిగిన కాలువగా కుడి కెనాల్‌కు పేరుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కట్టిన ఈ ప్రాజెక్టు దేశంలోని ప్రాజెక్టులకు తల్లి లాంటిది.

22 లక్షల ఎకరాలకు సాగునీరు
తెలుగు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు.. వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. కోట్ల గొంతుకలను తడుపుతున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది. హైలెవల్, లోలెవల్‌ కెనాల్‌ ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 600గ్రామాలకు తాగునీరు అందిస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు విద్యుత్‌ వెలుగులు
తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా కాకుండా విద్యుత్‌ వెలుగులను కూడా అందిస్తోంది. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌.. సాగు, తాగు నీరే కాదు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్తు వెలుగులను కూడా విరిజిమ్ముతోంది. ఇది జాతీయ గ్రిడ్‌కు విద్యుత్‌ ఉత్పత్తికి కూడా మూలం. కుడి కాలువ విద్యుత్తు కేంద్రం ద్వారా 90 యూనిట్లు, ఎడమ కాలువ ద్వారా 60 యూనిట్లు విద్యుత్తు, మెయి¯Œ పవర్‌ హౌజర్‌ నుంచి 815మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది.

సిరులు పండిస్తున్న రైతులు
జలాశయం నిర్మాణం తర్వాత అన్ని రంగాలలోనూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రజల జీవన నాగరికత, సుఖ సంతోషాలకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు దోహదపడింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయకట్టు రైతులు సిరులు పండించుకున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం తర్వాతే నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లాయని రైతులు చెబుతున్నారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న తమకు ఈ ప్రాజెక్టు దేవాలయంగా మారిందని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టు వల్లే అన్నం మెతుకులు తింటున్నామని దేశానికి అన్నం పెడుతున్నామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు

ప్రపంచ పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌..

ఇది ఒక ప్రపంచ పర్యాటక కేంద్రం. ప్రాజెక్టును చూడటానికి ప్రపంచంలోని పర్యాటకులు వస్తుంటారు. వానాకాలంలో కష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా ఉన్న ఈ డ్యాంను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. సాగర జలాల్లో తేడాతో సాగే బోట్‌ ప్రయాణం పర్యాటకులను ఎంతో ఆహ్లాద పరుస్తుంది. ఆచార్య నాగార్జున నేల ఇది. సాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో ఉన్న నాగార్జునకొండ మ్యూజియాన్ని, సాగర్‌లోని బుద్ధవనాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ సన్యాసులు బౌద్ధులు వస్తుంటారు.

నెరవేరని లక్ష్యం
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆనాడు తవ్విన కుడి, ఎడమ కాల్వలు కాలక్రమేణా దెబ్బతిని చివరి భూములకు నీరందే పరిస్థితి లేకుండాపోయింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సాగర్‌ ప్రాజెక్టు కింద చివరి భూములకు కూడా నీరందించాలని సంకల్పించి ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్‌ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు 2017లో పూర్తయ్యాయి. కానీ గతేడాది రెండు సార్లు కాలువకు గండ్లు పడ్డాయి. నేటికీ చివరి భూములకు నీరందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10