అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2 – ది రూల్’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం… ప్రీమియర్స్, విడుదల రోజు షోస్ నుంచే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపానికీ… సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ కీ ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు.
ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా నిలిచింది. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు వసూళ్లలో వరుసగా రికార్డులు సృష్టించిన ఈ చిత్రం, తాజాగా నాలుగో రోజుతో కలుపుకుని రూ.829 కోట్లు వసూలు చేసి ఆల్టైమ్ రికార్డును సృష్ఠించింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప 2 – ది రూల్’ బాక్సాఫీస్పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది.
ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్లో నాలుగో రోజు ఒక్కరోజులోనే రూ.86 కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకూ ఏ హిందీ చిత్రం కూడా సింగిల్ డేలో రూ.86 కోట్ల నెట్ను సాధించలేదు. హిందీలో నాలుగు రోజులకు రూ.291 కోట్లు కలెక్ట్ చేసి, ఇప్పటివరకూ ఇంత త్వరగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఏకైక హిందీ చిత్రంగా ఇది నిలవడం విశేషం.