పంజాబ్–హర్యానా బార్డర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ర్యాలీ రణరంగంగా మారింది. పంజాబ్–హర్యానా బార్డర్ శంభు వద్ద ఆదివారం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ ఇవ్వాలని 101 మంది రైతుల బృందం శంభు నుంచి ఢిల్లీకి మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. అయితే వీరి పాదయాత్ర కొన్ని మీటర్లు దాటగానే హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసన తెలిపేందుకు అనుమతి పత్రాలను చూపాలని హర్యానా పోలీసులు రైతులను కోరారు. దీంతో శంభు వద్ద రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
రైతుల ఆగ్రహం
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న ఓ రైతు మాట్లాడుతూ.. ‘పోలీసులు ఐడీ కార్డులు చూపాలని అంటున్నారు. ఐడీ చూయిస్తే ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతిస్తారా..? ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మరి తామేందుకు ఐడీ కార్డులు ఇవ్వాలి.’ అని ప్రశ్నించాడు. పోలీసులు స్పందిస్తూ.. ’ఐడీ కార్డులను తనిఖీ చేసిన తర్వాతే రైతులను ముందుకు వెళ్లనిస్తాం. మా వద్ద 101 మంది రైతుల జాబితా ఉంది. కానీ ఇక్కడి వచ్చిన వాళ్లంతా లిస్టులో ఉన్న వాళ్లు కాదు. ఐడీ కార్డులు చూయించాలన్నందుకే ఆందోళనకు దిగారు.’ అని తెలిపారు.