మరిన్ని హామీల అమలుకు చర్యలు
ఇప్పటికే సర్కార్ రేటింగ్ 4.5
పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఈ ఐదేళ్లే కాదు.. రానున్న మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. నేతలంతా విజయోత్సవాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మహేశ్కుమార్గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాటు అద్భుతమైన పాలన అందించామన్నారు. రానున్న సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధమైందన్నారు. వాటిని త్వరలో అమలు చేస్తామన్నారు. మా ప్రభుత్వానికి ఇప్పటికైతే ఐదుకి 4.5 మార్కులు ప్రజలు ఇస్తున్నారని వివరించారు.
ఈసారి గ్రేటర్లో సత్తాచాటుతాం..
ఈసారి గ్రేటర్లో సత్తాచాటుతామని టీపీసీసీ చీఫ్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ళు కాదు రానున్న 10 నుంచి 15 ఏళ్లు సుస్థిరంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని నమ్ముతున్నామని అన్నారు.
సామాజిక న్యాయం పాటించాం..
విప్లు, ఎమ్మెల్సీలు, నామినేట్ పోస్ట్ విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించామని తెలిపారు. ఉద్యమం నుంచి ఉద్భవించిన తెలంగాణకి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని వివరించారు. బతుకమ్మను తొలగించామని, దాన్ని వాళ్ళ పేటెంట్గా బీఆర్ఎస్ సీన్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు.
అది ఆయన వ్యక్తిగతం..
వెలమ సామాజిక వర్గంపై షాద్ నగర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూస్తున్నామని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కులం గురించి మతం గురించి వేరొక వ్యక్తి గురించి మాట్లాడటం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సమర్థించదన్నారు. ముఖ్యమంత్రితో ఈ విషయంపై చర్చించి షాద్నగర్ ఎమ్మెల్యేను వివరణ ఇవ్వమని కోరామని, ఇవాళ లేదా రేపు గానీ సమాధానం ఇస్తారన్నారు.
భవిష్యత్లో జరగనివ్వం..
మంత్రి కొండా సురేఖ గతంలో నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు వివరణ ఇచ్చారని, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు అన్ని హామీలు పూర్తి చేశామని, త్వరలో మరికొన్ని హామీలు త్వరలోనే నెరవేర్చబోతున్నా మన్నారు. ప్రచారంలో ముందుకు వెళ్లే విధంగా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశామన్నారు. ఏడాది పాలన హ్యాపీగా ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్.