AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిఖార్సైన హైదరాబాదీ రోశయ్యే.. నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం

వర్ధంతి సభలో సీఎం రేవంత్‌ వెల్లడి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఆయన విగ్రహం లేకపోవడం పెద్ద లోటని చెప్పారు. నగరంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన రోశయ్య మూడో వర్ధంతి సభలో పాల్గొన్న సీఎం.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో తాను, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రోశయ్య వద్దకు వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణ విషయంలో చర్చ సందర్భంగా తాను హైదరాబాదీనే అని చంద్రబాబుతో రోశయ్య అన్నట్లు గుర్తు చేసుకున్నారు.

‘నాకు చీరాలలో ఏమీలేదు..’
‘చూడయ్యా చంద్రబాబు.. నాకు చీరాలలో ఏమీ లేదు.. 50 సంవత్సరాల క్రితమే అక్కడున్నదంతా అమ్ముకొని హైదరాబాద్‌ వచ్చి అమీర్‌పేట ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా. నేను హైదరాబాద్‌ వాడినే తప్ప.. నాకు ఆ రాష్ట్రమా..? ఈ రాష్ట్రమా..? అనే తేడాలు లేవు. రెండు ప్రాంతాలు నాకు సమానమే. నేను హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన వాడినే’ అని రోషయ్య చంద్రబాబుతో చెప్పినట్లు సీఎం రేవంత్‌ వెల్లడించారు. ఈరోజు నిఖార్సైన హైదరాబాదీ ఎవరైనా ఉన్నారంటే అది రోషయ్య గారు మాత్రమే అని అన్నారు. అటువంటి రోషయ్యగారి విగ్రహం హైదరాబాద్‌ నగరంలో లేకపోవటం అనేది లోటన్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రోశయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.

రోశయ్య ఆర్థిక సామర్థ్యం వల్లే..
రోశయ్య ఆర్థిక సామర్థ్యంతోనే తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడిందని సీఎం రేవంత్‌ కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాలని రోశయ్య సూచించారన్నారు. ట్రబుల్‌ షూటర్‌గా రోశయ్య కీలక పాత్ర పోషించారు కాబట్టే.. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్‌ పని ఈజీ అయ్యిందన్నారు. ముఖ్యమంత్రులు ఎవరున్నా.. ప్రభుత్వంలో రోశయ్య నంబర్‌ 2గా ఉండేవారన్నారు. రోశయ్య ఎప్పుడూ పైనున్న వారిని దాటాలనుకోలేదని అన్నారు. మండలిలో తాను రోశయ్యను ఎదురించి మాట్లాడేవాడిని .. ఆయన తన చాంబర్‌కు పిలిచి సలహాలు,సూచనలు ఇచ్చేవారని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10