AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నడిరోడ్డుపై లేడీ కానిస్టేబుల్‌ నరికివేత.. రంగారెడ్డి జిల్లాలో దారుణం..

కొడవలితో నరికిచంపిన సొంత తమ్ముడు
ఆస్తి గొడవలా? లేక పరువు హత్యా?
పోలీసుల విచారణలో వెలుగులోకి కొత్త విషయాలు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాయపోల్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ నాగమణి హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధుల నిర్వహిస్తోంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా నెల రోజుల కిందట నాగమణి కులాంతర వివాహం చేసుకుంది. తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందని ఆగ్రహంతో సోదరుడు నడిరోడ్డుపై ఆమెను కొడవలితో నరికి చంపాడు. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

వెలుగులోకి కొత్త కోణం..
కానిస్టేబుల్‌ నాగమణి హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల విచారణలో ఆస్తి గొడవలే కారణమని తెలస్తున్నది.

గత నెలలో కులాంతర వివాహం..
రాయపోల్‌కు చెందిన నాగమణి గత నెల 1న.. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ను యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకున్నది. అనంతరం వారు హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్లారు. అయితే సోమవారం ఉదయం స్కూటీపై డ్యూటీకి వస్తుండగా.. కారులో వెంబడించిన తమ్ముడు పరమేష్‌ ఆమెను ఢీకొట్టాడు. అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తి కోసమే చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

వారసత్వంగా వచ్చిన భూమిని..
నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో పరమేశ్‌ అన్నీ తానే చూసుకున్నాడు. కాగా ఆమెకు ఇదివరకే వివాహమై విడాకుల కూడా అయ్యాయి. దీంతో తమ వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి వివాహం తర్వాత తమ్ముడికి ఇచ్చేసింది. అయితే రెండో పెండ్లి చేసుకున్న తర్వాత.. ఆ భూమిలో వాటా ఇవ్వాలని కొంతకాలంగా తమ్ముడిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో అక్కపై కోపంతో ఉన్న పరమేశ్‌ ఆమెను హత్యచేశాడు.

ANN TOP 10