ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు. దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు సరాసరి హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముందుగా ఈ కేసులో నవంబర్ 19 (మంగళవారం)న విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. డుమ్మా కొట్టాడు. సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు రాలేనని ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్లో రాంగోపాల్ వర్మ మెసేజ్ పెట్టాడు. విచారణకు సహకరిస్తానని, వారం రోజులు గడువు ఇవ్వాలని పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న (ఇవాళ) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ సారి కూడా డుమ్మా కొట్టడంతో పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు.