ఎగ్జిట్ పోల్స్ రివర్స్..
మరోసారి ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. జార్ఖండ్లో అధికారం చేతులు మారి.. బీజేపీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేయగా.. ఎన్నికల సంఘం విడుదల చేస్తున్న ఫలితాల్లో మాత్రం పూర్తిగా తారుమారు అయ్యాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమి.. మెజార్టీ మార్కును దాటింది.
ఇటీవల జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్రలో ప్రస్తుత మహాయుతి కూటమి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకుంటుందని.. కానీ జార్ఖండ్లో మాత్రం అధికార మార్పు ఖాయమని అంచనా వేశాయి. కానీ తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి మాత్రం మహారాష్ట్రాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకోగా.. జార్ఖండ్లో మాత్రం బెడిసికొట్టాయి. ప్రస్తుతం జేఎంఎం ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న ఇండియా కూటమి.. తిరిగి బంపర్ విక్టరీ సాధించింది. మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 41 కాగా.. ఇండియా కూటమి 50కిపైగా స్థానాలకు పైగా విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్లో మరోసారి ఇండియా కూటమిదే అధికారం అని ఖరారైంది. మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై జార్ఖండ్ ముక్తీ మోర్చా నేత హేమంత్ సోరెన్ కూర్చునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ రాజధాని రాంచీలో కీలక సమావేశం నిర్వహించింది.
గులాం అహ్మద్ నేతృత్వంలో భేటీ
శనివారం ఉదయం జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జి గులాం అహ్మద్ నేతృత్వంలో భేటీ జరిగింది. ఈ మీటింగ్కు జార్ఖండ్కు ఎన్నికల పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తారిఖ్ అన్వర్, కృష్ణ అల్లవూరితో పాటు ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ రాజేష్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. జార్ఖండ్లో ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కూటమిలో అత్యధిక స్థానాలు జేఎంఎం గెలుచుకోవడంతో సీఎం కుర్చీ కూడా జేఎంఎందే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే జార్ఖండ్ సీఎంను ఎంపిక చేసి.. ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.