కేసు విచారణ ముమ్మరం
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నేతల పేర్లు బయటపడుతున్నాయి. పోలీసులు ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు. ఒక్కొక్కొరిగా ఫోన్ ట్యాపింగ్ బాధితులను, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని విచారిస్తున్నారు. దీంతో బడా నాయకుల నుంచి చోటా నేతల వరకు పలురురి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. పలువురు అధికారులు సైతం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరైన సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్రావు నా∙ఫోన్∙ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలించి విచారణ చేశారు.
మా ఫోన్లన్నీ ట్యాంపింగ్..
ఈ సందర్భంగా సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్… మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని, తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆపిల్ కంపెనీ ద్వారా తనకు అలర్ట్ మెసేజ్ వచ్చిందని, దీనిపై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. గంటన్నర పాటు పోలీసులు విచారణ జరిపి.. స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ అవ్వాలని… లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారన్నారు. తన వ్యక్తిగత ఫోన్తో పాటు తన భార్య, డ్రైవర్, తమ కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, మేము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ అప్పటి డిసిపి రాధా కిషన్ రావు బెదిరింపులకు దిగారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్పై హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నానని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తానని చక్రధర్ గౌడ్ స్పష్టం చేశారు.