AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొడంగల్‌ నుంచే రేవంత్‌ భరతం పడతాం.. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఫైర్‌

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన..
– అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయ్‌..
– మా కార్యకర్త అధికారులకు పద్ధతిగా చెప్తే తప్పా..
– సురేశ్‌ అనే వ్యక్తి.. బరాబర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడే

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి.. సీఎం రేవంత్‌ కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి తుగ్లక్‌ విధానాల వలనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. కొడంగల్‌ నుంచే సీఎం రేవంత్‌ రెడ్డి భరతం పడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిది అరెస్ట్‌ కాదు.. కిడ్నాప్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి, అన్న శరత్‌ల ఫార్మా కంపెనీలను విస్తరించటం కోసం ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. తన ఏడు ఎకరాల భూమి పోతుందనే కలెక్టర్‌ను సురేశ్‌ అడిగాడని.. సురేశ్‌ అనే వ్యక్తి.. బరాబర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడే అని స్పష్టం చేశారు.

మీరు బలికావొద్దు…
‘‘సీఎం రేవంత్‌ .. వాడో పిచ్చోడు.. ఫార్ములా వన్‌ ఈ రేసు గురించి ఆయనకేం తెలుసు. నిఘా వ్యవస్థ వైఫల్యం వలనే లగచర్ల ఘటన.. కలెక్టర్‌ గన్‌ మెన్లు ఎక్కడ. ప్రభుత్వ కుట్రకు పోలీస్‌ ఉన్నతాధికారుల బలికావద్దు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు సురేశ్‌ పద్ధతిగా.. మర్యాదగా చెప్తే తప్పా. సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా. సురేష్‌ మమల్ని కలవటం తప్పు అయితే.. రాహుల్‌ గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్‌ కలవటం కూడా తప్పే. హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వం జడ్జిలను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ పాలన. రేవంత్‌ పిచ్చి నిర్ణయాల వలనే కొడంగల్‌ రగులుతోంది. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌.. మహారాష్ట్రకు మూటలు మోస్తున్నాడు. రైతులు అక్రమ అరెస్ట్‌లు జరుగుతుంటే సీఎం ఎక్కడ. షోలాపూర్‌ చౌరాస్తాలో నిలబడినా.. రేవంత్‌ను ఎవరూ గుర్తుపట్టరు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు..
కనీసం సతీమణికి కూడా సమాచారం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. తీవ్రవాదుల మాదిరి రైతులను పొలాల వెంబడి తరుముతున్నారన్నారు. ఫార్మా విలేజ్‌ వలన వచ్చే లాభమేంటో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర పెద్దలను తాను కలవటం తప్పు అయితే.. సీఎం గవర్నర్‌ను కలవటం కూడా తప్పే అని అన్నారు. కొడంగల్‌ రైతులు ఆరేడు నెలలుగా రగులుతున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి అనలేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అని చెప్పి.. మళ్ళీ యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.

సీఎం అల్లుడి కోసమే..
హైదరాబాద్‌ భవిష్యత్తు కోసమే ఫార్మా సిటీ నిర్ణయం తీసుకున్నామని మాజీ మంత్రి చెప్పారు. అయితే సీఎం సొంత అల్లుడు సత్యనారాయణ రెడ్డి మాక్స్‌ బీఎన్‌ ఫార్మా కంపెనీ విస్తరణ కోసమే ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌కు వెళ్ళని రేవంత్‌.. మెడికవర్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మాత్రం వెళ్తారన్నారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్‌ చెప్తుంటే.. ఐజీ దాడి జరిగిందంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10