AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే షెడ్యూల్.. మొదట యాదగిరిగుట్టకు చేరుకుని.. పాదయాత్రగా..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు నేడు.  జన్మదినాన్ని పురస్కరించుకుని.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు.. రాష్ట్రవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. తన పుట్టినరోజు వేళ.. సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంటీ.. తన బర్త్‌డే రోజున ప్రారంభించనున్న పాదయాత్ర రూట్ మ్యాప్‌ ఏంటీ అన్న విషయాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా రేపు (నవంబర్ 08న).. హెలికాప్టర్‌లో కుటుంబ సమేతంగా ఉదయం 8:45 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుంటారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

సమాచారం అనంతరం.. మధ్యాహ్నం ఒంటి గంటకు వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. “మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర” పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో భాగంగా.. మూసీ నది వెంట ఉన్న పరివాహక ప్రాంతాల గుండా పాదయాత్ర చేస్తూ.. అక్కడి రైతులతో ముచ్చటించనున్నారు. వారి బాధలు తెలుసుకుంటూనే.. మూసీ పునరుజ్జీవంపై భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలోనే.. భీమ లింగం, ధర్మారెడ్డి కాల్వలను కూడా రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. మూడుపాయల వద్ద ఉన్న భీమలింగాన్ని దర్శించుకోనున్నారు.

అనంతరం మూసీ పరివాహక ప్రాంతాల రైతులతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. మూసీ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారంటూ.. రేవంత్ రెడ్డి పుట్టిన రోజు షెడ్యూల్‌తో పాటు పాదయాత్ర రూట్ మ్యాప్ గురించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10