ఎఫ్ఐఆర్ నమోదు!
తెలంగాణలో పేలనున్న ‘పొలిటికల్ బాంబులు’
సర్వత్రా ఉత్కంఠ
గవర్నర్, రేవంత్ భేటీపై హాట్హాట్ చర్చ
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయా..? నేడో రేపో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత అరెస్టు కాబోతున్నారా? ఫార్ములా ఈ–కార్ రేసింగులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుందా..? ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాబోతున్నదా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. మరోవైపు ఫార్ములా–ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేల్చిన బాంబులకు సమయం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగానూ కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ కేడర్లోనూ మరింత ఉత్కంఠ నెలకొంది.
కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫార్ములా–ఈ కారు రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగం అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. కాగా దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరినట్లు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం.
అర్వింద్కుమార్పైనా కేసు..!
మరోవైపు అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ పై ప్రభుత్వం కేసు నమోదుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసినట్లు సమాచారం. అప్పటి చీఫ్ ఇంజినీర్పై కేసు నమోదు చేసి, విచారణ జరిపేందుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కలవడం అనేక చర్చలు దారి తీసింది. అయితే కేటీఆర్ ను అరెస్ట్ చేయడం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం రేవంత్ గవర్నర్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.
ఏంటి ఈ కేసు?
2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా– ఈ కార్ రేసుకు ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో ఆనాడు మంత్రి గా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల 2024 ఫిబ్రవరి నెలలో జరగాల్సిన 2వ దఫా రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్ఈఓకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూ.55 కోట్లు ఇవ్వడంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబట్టింది.
కాగా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లు పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు. కాగా దీనిపై గతంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలను బయటపెట్టారు. దీనిపై విచారణను ఏసీబీకు అప్పగించింది రేవంత్ సర్కార్. ఈ కేసులో పూర్తి వివరాలను బయటకు రాబట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ చేసి విచారణ చేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ అరెస్ట్ అనుమతి కోసం గవర్నర్ కు లేఖ రాశారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.