మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచులకు భారీ ఊరట కలిగించే మాట వినిపించారు. గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. మాజీ సర్పంచులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. సర్పంచులకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసని.. కొంచెం ఓపిక పడితే మార్చి నెలాఖరులోగా బకాయిలన్ని చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సర్పంచుల బకాయిలకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న మంత్రి పొన్నం.. పొలిటికల్ పార్టీల ట్రాప్లో పడొద్దని సూచించారు.
ఇదే క్రమంలో.. మాజీ సర్పంచుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బీఆర్ఎస్ నేతల తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయిన వారే.. ఈరోజు వాళ్లకు మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమను ప్రశ్నించే ముందు గత పదేళ్లుగా తెలంగాణకు చేసిందేమిటో ముందు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా ఏం చేసిందేంటో.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అమర వీరుల స్థూపం దగ్గర చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.