సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. `భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం.ఈ స్కూల్ లో 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయి. రూ.200 కోట్ల నిధులతో ఈ స్కూల్ నిర్మాణం చేపట్టాం. ఇందుకోసం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి రావడం చాలా సంతోషంగా ఉంది.
ఇక్కడ ఉన్నావారు కాంగ్రెస్ సభ్యులు కారు. వీరంతా మా కుటుంబ సభ్యులు. రాష్ట్ర చరిత్రలో ఈసారి 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. సన్న రకాలకు క్వింటాల్పై రూ.500 బోనస్ ఇస్తున్నాం` అని చెప్పారు.
`సంక్రాంతి తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తాం. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకూ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఇప్పటికే రూ.18వేల కోట్ల పంట ఋణాలు మాఫీ చేశాం. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు` అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ .. `ఈ స్కూల్లో నాలుగో తరగతి నుండి 12వ తరగతి వరకు 2000మంది విద్యార్థులు చదుకోవచ్చు. అన్ని కులాల విద్యార్థులు ఈ స్కూల్ లో చదుకోవచ్చు. గడ్డిపల్లి కి స్కూల్ మంజూరు కావడం. ఈ స్కూల్ శంకుస్థాపన కోసం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది` అని చెప్పారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. `భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసాం. ఈ స్కూల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ తోపాటు పలు రకాల కార్యక్రమాలు ఉంటాయి. 25 ఎకరాలలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేస్తాం. టీచర్లు కూడా స్కూల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటాం. విద్యావైద్యానికి ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తుంది. గత ప్రభుత్వం విద్యా వైద్యానికి రూ.70 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం ఒకేసారి రూ.5000 కోట్లు మంజూరు చేసింది. ప్రతి పైసా ప్రజలు కోసం ఖర్చు పెడతాం. ఈ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి` అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందా లాల్ పవర్ తదితరులు పాల్గొన్నారు.