శుభకార్యం నిమిత్తం బైక్పై వెళు్తన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మృత్యురూపంలో ట్రాక్టర్ బలిగొన్నది. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం వద్ద చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు.. మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మన్నే ఆంజనేయులు(50), తన మరదలు లావణ్య(35) ఆమె పిల్లలు సహస్ర(10), శాన్వి(6)లను బైక్ మీద పోతారం స్టేజీ వద్ద దింపేందుకు బయలుదేరాడు. గ్రామానికి స్టేజీ వద్ద రెండు కిలో మీటర్ల దూరం ఉండగా, మార్గమధ్యలో రోడ్డుపై రైతులు ధాన్యం ఆరబోశారు. ఒకే వరుసలో వెళ్లడానికి దారి ఉండగా బైక్ను ఎదురుగా వచ్చి ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, బంధువులు ఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పి మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు.
ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణం రహదారిపై వడ్లకుప్పలు పోయడమే కారణమని పేర్కొంటున్నారు. ఒక వైపు వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నలుగురిని బలి తీసుకుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.